తిరుపతి ముచ్చట్లు:
అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. శ్రీరామనామ స్మరణతో, గోవింద నామసంకీర్తనల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.
ముందుగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు భక్తిరసభరిత సంకీర్తనలను ఆలపించి శ్రీరామ భక్తిని పరవశింపజేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు.
ఉదయం నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు “రామచంద్రుడితడు రఘువీరుడు”, “జయతు జయతు మంత్రం జన్మసాఫల్య మంత్రం”, “జయ జయ రామ”, “రాముడు రాఘవుడు” తదితర సంకీర్తనలను మధురంగా ఆలపించి భక్తులను అలరించారు.
తదనంతరం తిరుపతికి చెందిన హేమప్రకాశ్ బృందం గాత్ర సంగీత సేవ అందించగా, వేంకటేశ్వర్లు భాగవతార్ హరికథా గానం ద్వారా శ్రీరాముని మహిమను భక్తులకు వినిపించారు.
సాయంత్రం బెంగళూరుకు చెందిన స్వాతి రామలక్ష్మీ బృందం సంగీత సభ నిర్వహించనుండగా, అనంతరం కుమారి శ్రీ నయనప్రియ బృందం “శ్రీరామ జననం” నృత్యరూపకాన్ని ప్రదర్శించనున్నారు.
మహతి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు
మహతి కళాక్షేత్రంలో సాయంత్రం తిరుపతికి చెందిన రమణి, రాజేష్కుమార్ బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించనుండగా, రాత్రి హైదరాబాద్కు చెందిన స్వాతిరెడ్డి బృందం భక్తిరసభరిత నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డా. మేడసాని మోహన్, డైరెక్టర్ లత, శ్రీ కోదండరామస్వామి ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags:The Royal Court of Sri Kodandarama Swamy, Celebrated with Great Devotion and Grandeur