తిరుపతి ముచ్చట్లు:
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పోలీస్ శునక దళంలో విశిష్ట సేవలు అందించిన ఎక్స్ప్లోసివ్ డిటెక్షన్ శునకం “సింధు” సహజ కారణాలతో మృతి చెందిన సందర్భంగా పోలీస్ అధికారులు నివాళులు అర్పించారు.
లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన ఆడ శునకం “సింధు” 28.12.2013న జన్మించింది. 2014 సంవత్సరంలో హైదరాబాద్లోని ఐఐటీఏ, మొయినాబాద్లో ప్రత్యేక శిక్షణ పొందిన అనంతరం తిరుమల–తిరుపతి ప్రాంతాల్లో శునక దళంలో సేవలందించింది. ఎక్స్ప్లోసివ్ డిటెక్షన్ విభాగంలో పనిచేసిన “సింధు” తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి పోలీస్ శాఖ సంయుక్త భద్రతా విధుల్లో కీలక పాత్ర పోషించింది.
తిరుమలలో జరిగే విఐపీ, వీవీఐపీ పర్యటనలు, యాంటీ సబోటాజ్ తనిఖీలు, భద్రతాపరమైన సున్నిత ఆపరేషన్లలో “సింధు” అత్యంత అప్రమత్తతతో విధులు నిర్వహించి శాఖకు విశేష సేవలు అందించింది. తన సేవా కాలంలో శిక్షణా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకుంది. 2021లో మంగళగిరిలో నిర్వహించిన రిఫ్రెషర్ కోర్సులో మూడో బహుమతి సాధించడం ద్వారా తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది.
వయోభార కారణాల రీత్యా 02.09.2023న విధుల నుంచి విరమణ చేసిన “సింధు” 01.05.2026న సాయంత్రం 7.10 గంటలకు సహజ కారణాలతో మృతి చెందింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,మాట్లాడుతూ, పోలీస్ శాఖకు సేవలందించిన శునక దళ సభ్యులు కూడా పోలీస్ కుటుంబంలో అంతర్భాగమేనని, “సింధు” అందించిన సేవలు శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం నిబద్ధతతో పనిచేసిన “సింధు” సేవలను తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ గౌరవంగా స్మరించుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలొ ఎం. రామకృష్ణ, డీఎస్పీ , డీఎస్డబ్ల్యూ, తిరుపతి శ్రీనివాసరావు, ఏవీ & ఎస్వో, టీటీడీ, తిరుపతి; డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ డిస్పోజల్ టీమ్ సిబ్బంది హాజరయ్యారు.
Tags: Sindhu,” the police dog that rendered distinguished service to the Police Department, has passed away.