♦️వెజ్ బిర్యానీ 200 రూపాయలు
♦️ తిరుమలలో భక్తులను దోచుకుంటున్న జనతా క్యాంటీన్లు
♦️నీరుగారుతున్న టీటీడీ లక్ష్యం
♦️ తక్కువ ధరకే స్థలం కేటాయించిన ఎక్కువ ధరలు వసూలు
♦️భక్తులను దోచుకుంటున్న జనతా హోటళ్లు
తిరుమల ముచ్చట్లు:
సామాన్య భక్తులకు తక్కువ ధరకు ఆహారం అందించాలన్న టీటీడీ లక్ష్యం జనతా క్యాంటీన్ల వద్ద నీరుగారుతోంది. తక్కువ అద్దెకే కేటాయించినా నిర్వాహకులు మాత్రం పెద్ద క్యాంటీన్లు, ఏపీ టూరిజం హోటళ్లకంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తూ భక్తులను దోచుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాదాలు పెద్దఎత్తున అందిస్తోంది. అయితే నచ్చిన ఆహారం కోసం కొందరు బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలకు వెళ్తుంటారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల హోటళ్లలో ధరలు భారీగా పెంచడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ ధర్మకర్తల మండలి సదుద్దేశంతో బిగ్, జనతా క్యాంటీన్ల అద్దెలను తగ్గించింది. నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకు అందించాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా 5 జనతా క్యాంటీన్లకు అనుమతించి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల లోపు అద్దెను ఖరారు చేసింది.
ధరల్లో భారీ వ్యత్యాసం: ఎస్ఎంసీ ఏరియాలోని ఓ జనతా హోటల్ ధరలు చూస్తే భక్తులు హడలిపోవాల్సిందే. 2 ఇడ్లీలు రూ.40, 2 వడలు రూ.70, పన్నీర్ దోశ రూ.110, సాధారణ దోశ రూ.60 నుంచి రూ.110, సౌత్ ఇండియన్ భోజనం రూ.220, పిల్లలకు రూ.160, వెజ్ బిర్యానీ రూ.200, పెరుగన్నం రూ.95, స్టార్టర్స్ రూ.150 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. మిల్క్ షేక్స్ రూ.100 తక్కువ లేవు. వీటిపై పన్నులు అదనం.
శ్రీఅన్నమయ్య భవనంలోని ఏపీ టూరిజం హోటల్ నెలకు రూ.5 లక్షల వరకు అద్దె చెల్లిస్తోంది. అక్కడ రెండు ఇడ్లీలు రూ.25, వడ రూ.40, దోశ రూ.50 నుంచి రూ.120, సౌత్ ఇండియన్ భోజనం రూ.150, పిల్లలకు రూ.95, వెజ్ బిర్యానీ రూ.150గా ఉంది. ఎక్కువ అద్దె చెల్లించే పెద్ద క్యాంటీన్కంటే తక్కువ అద్దెకు నడుస్తున్న జనతా హోటళ్లలో ధరలు అధికంగా ఉండడంపై భక్తులు మండిపడుతున్నారు.
త్వరలో ధరలు ఖరారు: జనతా క్యాంటీన్లలో ధరల పట్టికను ఇంకా ఖరారు చేయలేదని టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతిలోని ఇండియన్ కలినరి అకాడమీ ద్వారా అధ్యయనం చేయించి ధరలు నిర్ణయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే వారు ధరలు నిర్ణయిస్తారని అన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి క్యాంటీన్ల యజమానులతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనల మేరకు హోటళ్లు నడపాలని, అప్పటివరకు ధరలు తగ్గించాలని సూచించినట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Tags: Exploitation at Janata Canteens in Tirumala