: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
👉ఫిర్యాదులపై అలసత్వం లేకుండా చట్టపరిధిలో తక్షణ న్యాయం అందించాలని, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సోమవారం నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫిర్యాదులు అందిన వెంటనే, వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించి, ప్రజలకు సత్వర న్యాయం అందించాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీ కి విన్నవించుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సావధానంగా ఆలకించారు.
ఈ సందర్భంగా వచ్చిన ప్రధాన ఫిర్యాదులలో కొన్ని..
భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తమామల వేధింపులు, వృద్ధ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం.
ఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీలకు సంబంధించిన సమస్యలు, సైబర్ నేరాలు. భూమికి సంబంధించిన తగాదాలు, నకిలీ పత్రాల ద్వారా మోసాలు.
ప్రతి ఫిర్యాదుదారుడితో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ , సమస్యల మూలాలను తెలుసుకున్నారు.
అర్జీదారులు జిల్లా కేంద్రానికి రాలేని వారు, తమ సమీప పోలీస్ స్టేషన్, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయంలో అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. వీటిని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణిస్తామన్నారు.
ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా, సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్లో స్వయంగా మాట్లాడి, కీలక సూచనలు చేశారు. “పిజిఆర్ఎస్ ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించాలి. ప్రజలకు చట్ట పరిధిలో తక్షణమే న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలి. తీసుకున్న చర్యల వివరాలతో కూడిన నివేదికను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలి,” అని ఎస్పీ అధికారులకు స్పష్టం చేశారు.ప్రజా సేవలో అన్నమయ్య పోలీసులు నిరంతరం ముందుంటారని, ప్రజలు ధైర్యంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
Tags: Annamayya Police Prioritize Resolution of Public Issues