April 8, 2026
Explore
మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

April 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేసి, కొత్త షెడ్యూల్ అమలు చేయాలని స్పష్టం చేసింది.

ఫీల్డ్ స్టాఫ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రస్తుతం 2027 జనగణన సంబంధిత పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ కారణంగా వార్డుల పునర్విభజన పనులు సకాలంలో పూర్తి చేయడం కష్టమని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. వార్డుల సరిహద్దులు, జనాభా గణాంకాల కచ్చితత్వం, భౌగోళిక సవరణలు వంటివి క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మరింత సమయం అవసరమని వారు తెలిపారు.

తొందరపాటుతో డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్న మున్సిపల్ శాఖ, ప్రక్రియకు మరింత సమయం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు, ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు పెంపు నిర్ణయంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags: Deadline Extended for Municipal Ward Delimitation: AP Government Takes Key Decision