-దుమ్ముతో కష్టాలు
- రోడ్డేక్కిన జనం
పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి పనులు ప్రారంభించి అర్ధంతరంగా ఆపివేయడంతో కట్టక్రిందపాళెం వాసులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేసిన సంఘటన సోమవారం పట్టణంలో జరిగింది. పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై గుంతలు పడటంతో రెండు నెలల క్రితం అధికార పార్టీ కాంట్రాక్టర్ , అధికారులు కలసి జెసిబిలతో రోడ్డును పెరికివేశారు. రోడ్డుపై తెల్లటి మట్టితో కూడిన కంకర వేసి వదిలివేసి , రెండు నెలలైన తారు రోడ్డు వేయలేదు. దీంతో వందలాది వాహనాలు రాకపోకల కారణంగా దుమ్ము రేగి కట్టక్రిందపాళెంలోని ప్రజల ఇండ్లలోకి చేరిపోతోంది. దుమ్ము మబ్బుల్లా ఎగిసి పరిసర ప్రాంతాలను కమ్మేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు , అలర్జీలు వంటి ఆనారోగ్యాలకు గురౌతున్నారని కట్టక్రిందపాళెం ప్రజలు నినాదాలు చేశారు. తక్షణమే రోడ్డు పనులు చేయాలని లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. రోడ్డు స్తంభించిపోవడంతో సీఐ సుబ్బరాయుడు ఆందోళనకారుల వద్దకు చేరుకుని ప్రజలకు నచ్చజెప్పి ధర్నాను విరమింపచేశారు. పనులు తక్షణమే చేయిస్తామని హామి ఇచ్చారు.
Tags: Government Negligence: Road Works Halted