తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు బుధవారం కన్నులపండుగగా ముగిశాయి.
తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు.
అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడుసేవను వార్షిక వసంతోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, పేష్కార్ రామ కృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: Srivari’s Annual Vasanthotsavams Conclude Grandly