అనకాపల్లి ముచ్చట్లు:
అనకాపల్లి పట్టణంలో తప్పిపోయిన పదేళ్ల బాలుడిని ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా సమయస్ఫూర్తితో వ్యవహరించిన ట్రాఫిక్ ఎస్సై శేషగిరిరావును ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ ప్రత్యేకంగా అభినందించారు.
పరవాడ మండలం, మరిసవాణిపాలెం గ్రామానికి చెందిన కొండలరావు కుమారుడు భూగిది జోషిత్ (10), 4వ తరగతి చదువుతున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి అనకాపల్లి నూకాలమ్మ తల్లి దర్శనం కోసం వచ్చిన జోషిత్, జనాల రద్దీలో పొరపాటున తల్లిదండ్రుల నుండి విడిపోయాడు. కంగారులో వెతుక్కుంటూ అనకాపల్లి నేషనల్ హైవే (NH 16) జంక్షన్ వద్దకు చేరుకుని, దిక్కుతోచని స్థితిలో ఉండటాన్ని అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై శేషగిరిరావు గమనించారు.
భయపడుతున్న బాలుడిని ఎస్సై దగ్గరకు తీసుకుని, బుజ్జగించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడు చెప్పిన సమాచారం ఆధారంగా తండ్రి ఫోన్ నంబర్ను సేకరించి వెంటనే సమాచారం అందించారు. అప్పటికే బాలుడు కనిపించక ఆందోళనతో వెతుకుతున్న తల్లిదండ్రులు, ఎస్సై ఫోన్ చేయడంతో ఊపిరి పీల్చుకుని హైవే జంక్షన్ వద్దకు చేరుకున్నారు. బాలుడిని క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
“పోలీసులు తక్షణమే స్పందించి మా బిడ్డను మాకు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. పోలీసుల మానవత్వానికి మా ధన్యవాదాలు.”
— బాలుడి తల్లిదండ్రులు
సకాలంలో స్పందించి ఒక కుటుంబాన్ని కలిపిన ఎస్సై శేషగిరిరావును మరియు సిబ్బందిని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ అభినందిస్తూ, ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యతని పేర్కొన్నారు.
Tags: Anakapalli Traffic Police Reunite Missing Boy with Parents