అమరావతిముచ్చట్లు:
పండగ పూట ఎంతో భక్తితో అమ్మవారికి అలంకరించిన బంగారు నగలను పొరపాటున పూలతో పాటు డ్రైనేజీ కాలువలో పడేసింది ఓ కుటుంబం. తీరా విషయం తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా, వారు రంగంలోకి దిగి గంటలపాటు శ్రమించి ఆ నగలను వెలికితీసి అప్పగించారు. విశాఖపట్నంలోని గాజువాకలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. గాజువాక శ్రీనగర్కు చెందిన ఉడుముల రమేశ్, దివ్య దంపతులు ఈ నెల 21న అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలతో అలంకారం చేశారు. ఆనవాయతీ ప్రకారం మూడు రోజుల పాటు నగలను అమ్మవారి వద్దనే ఉంచారు. ఆదివారం (23వ తేదీ) పూజా సామాగ్రిని తొలగించే క్రమంలో రమేశ్.. అమ్మవారికి అలంకరించిన 3 తులాల హారం, కాసులను మాత్రమే తీసి భద్రపరిచారు.
అయితే, పూలు, ఇతర పూజా సామగ్రిలో కలిసిపోయిన సుమారు 5 తులాల బరువున్న కంకణం, రెండు గొలుసులు, మూడు ఉంగరాలను ఆయన గమనించలేదు. నిర్మల్యం మొత్తాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి, దుర్గా నగర్ సమీపంలోని స్టీల్ ప్లాంట్ రైల్వే బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజీ కాలువలో పడేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నగలు కనిపించకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే కాలువ వద్దకు పరుగులు తీసి వెతికినా ఫలితం లేకపోవడంతో, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తక్షణమే స్పందించిన సీఐ కేశవరావు, సిబ్బందిని రంగంలోకి దించారు. జేసీబీ సహాయంతో కాలువలో నీటి ప్రవాహాన్ని మళ్లించి, వేగాన్ని తగ్గించారు. అనంతరం కాలువలో చెల్లాచెదురుగా పడి ఉన్న నగలను సిబ్బంది ఒక్కొక్కటిగా వెలికితీశారు. ఆ ఆభరణాలను దంపతులకు సురక్షితంగా అప్పగించారు. పోయాయనుకున్న బంగారం తిరిగి చేతికి అందడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పోలీసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పండగలు, పూజల సమయంలో విలువైన వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు.
Tags: They performed a ritual… and threw gold into a dirty drain!