August 10, 2026
Explore
తండ్రిని కోల్పోయినా పట్టుదలతో ఉన్నత ఉద్యోగం సాధించిన సందీప్

తండ్రిని కోల్పోయినా పట్టుదలతో ఉన్నత ఉద్యోగం సాధించిన సందీప్

August 10, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

తల్లిదండ్రులకు మీ లాంటి కొడుకులు ఉంటే చాలు…. పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక పులా పాన్పు లాగా అనిపిస్తుంది…చదువు ఎవరి సొత్తు కాదు అని నిరూపించాడు… ఈ యువకుడు

వ్యవసాయ కుటుంబం నుంచి ఎన్‌హెచ్ఏఐ ఉన్నతాధికారిగా తెలంగాణ యువకుడు

గేట్ సివిల్ ఇంజినీరింగ్‌లో 46వ ర్యాంకుతో ఎన్‌హెచ్ఏఐలో ఎంపిక

చిత్తూరు డివిజన్‌లో డిప్యూటీ మేనేజర్‌గా బాధ్యతల స్వీకరణ

వ్యవసాయం చేస్తూ చదివించిన తల్లి, తాతయ్యలకు ఈ విజయం అంకితం

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం, కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం లాంటి కష్టాలు ఎదురైతే ఎవరి జీవితమైనా తలకిందులవుతుంది. కానీ, సంకల్పం బలంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించి విజయం సాధించవచ్చని నిరూపించాడు తెలంగాణకు చెందిన ఓ యువకుడు. పాలకుర్తి మండలం ఎల్లపురం గ్రామానికి చెందిన బొడ్డు సందీప్ యాదవ్ (24) అనే యువ ఇంజనీర్, కష్టాలను జయించి ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎన్‌హెచ్ఏఐ)లో ఉన్నత ఉద్యోగం సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

సందీప్ ఏడో తరగతి చదువుతున్నప్పుడు అతని తండ్రి వెంకటేశ్వర్లు యాదవ్ మరణించారు. దీంతో కుటుంబ భారం మొత్తం తల్లి ధనలక్ష్మి, తాతయ్య లింగయ్య, అమ్మమ్మ సాయమ్మపై పడింది. వ్యవసాయ కుటుంబం కావడంతో తమకున్న ఐదు ఎకరాల పొలంలో కష్టపడి పనిచేస్తూనే సందీప్‌ను, అతని చెల్లెలు సుష్మను చదివించారు. కుటుంబం పడుతున్న కష్టాలను చూసిన సందీప్, చదువుతోనే తన భవిష్యత్తును మార్చుకోవాలని బలంగా నిశ్చయించుకున్నాడు.

మిర్యాలగూడలో పాఠశాల విద్యను పూర్తి చేసిన సందీప్, కష్టపడి చదివి ఐఐటీ మధ్యప్రదేశ్‌లో ఇంజినీరింగ్ సీటు సంపాదించాడు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్‌)లో చేరాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ఏస్ అకాడమీలో 18 నెలల పాటు తీవ్రమైన శిక్షణ తీసుకున్నాడు. ఈ సమయంలో ఎన్నో వ్యక్తిగత సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురైనా క్రమశిక్షణతో రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు చదువుపైనే దృష్టి పెట్టాడు.

ఆ కఠోర శ్రమకు ప్రతిఫలం దక్కింది. ‘గేట్’ స్కోర్ ఆధారంగా జరిగిన నియామక ప్రక్రియలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో సందీప్ 46వ ర్యాంకు సాధించాడు. దీంతో ఎన్‌హెచ్ఏఐలో డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల చిత్తూరు డివిజన్‌లో ఆయన తన బాధ్యతలను స్వీకరించారు.

విజయంపై సందీప్ మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదని, కష్టకాలంలో తనకు అండగా నిలిచి చదివించిన తన తల్లి, తాతయ్యల త్యాగాలకు తాను ఇచ్చే కానుక‌ అని అన్నారు. “కష్టపడిన వెంటనే ఫలితం రాకపోవచ్చు, కానీ సహనం, బాధ్యత, నిరంతర ప్రయత్నంతో లక్ష్యం వైపు సాగితే విజయం తప్పక వరిస్తుంది” అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఎన్‌హెచ్ఏఐలో సాంకేతిక నాయకత్వ పాత్రకు ఎదగడం, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా జయించవచ్చనడానికి సందీప్ ప్రయాణం ఒక చక్కటి ఉదాహరణ.

Tags:Sandeep secured a high-level job through sheer determination, despite losing his father.