August 6, 2026
Explore
అగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారంపై కూటమి ప్రభుత్వ ఫోకస్.. సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్లు

అగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారంపై కూటమి ప్రభుత్వ ఫోకస్.. సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్లు

August 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

6,000 ఎకరాలకు పైగా ఆస్తుల వేలానికి సీఐడీకి ఆదేశాలు

ఆగస్టు 15లోగా ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశం

9 రాష్ట్రాల్లో బాండ్ల సేకరణకు ప్రత్యేక సెల్స్ ఏర్పాటు

బాధితులకు పూర్తి సమాచారం కోసం ప్రత్యేక వెబ్‌సైట్

రాష్ట్రంలోని లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను వేగవంతం చేశామని, వారికి తప్పకుండా న్యాయం చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, ఇప్పటికే మూడుసార్లు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించామని తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితులు నిజమైన బాధితులని పేర్కొన్న మంత్రి, వారి సమస్య పరిష్కారానికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌కు సంబంధించి సుమారు 20,000 ఎకరాల భూములు ఉండగా, ఇందులో 6,000 ఎకరాలకు పైగా భూములు వెంటనే వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ వేలం ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని సీఐడీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. చరాస్తుల విషయంలో కూడా పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.

అగ్రిగోల్డ్ సంస్థ తరఫున సుమారు 5 లక్షల మంది ఏజెంట్లు పనిచేసి, దాదాపు రూ. 6,000 కోట్ల డిపాజిట్లు సేకరించారని, ఇందులో రూ. 3,000 కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. మొత్తం 18,57,290 మందికి ప్లాట్లు ఇస్తామన్న హామీతో ఈ డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.

మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో ఏజెంట్లు పనిచేసినందున, ఆయా రాష్ట్రాల్లో బాండ్ల సేకరణ కోసం పోలీసులతో ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మనోహర్ వివరించారు. సెప్టెంబర్ 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఆగస్టు 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం జరగనుందని, ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఆగస్టు 15 నాటికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేలానికి సంబంధించిన విధివిధానాలను కూడా త్వరలోనే ఖరారు చేసి, దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags: Alliance government focuses on the AgriGold victims’ issue; sets deadlines for resolving the problem.