మదనపల్లి ముచ్చట్లు:
వెట్టిచాకిరీ చేయించినా.. కార్మికులను అక్రమంగా తరలించినా కఠిన చర్యలు: – అదనపు ఎస్పీ యం.వెంకటాద్రి .సమాజంలో పీడిత వర్గాల పట్ల జరుగుతున్న వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమ రవాణాను సమూలంగా నిర్మూలించే దిశగా అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం ‘వెట్టి చాకిరీ (నిర్మూలన) చట్టం – 1976’ మరియు ‘కార్మికుల అక్రమ రవాణా (ట్రాఫికింగ్ ఫర్ లేబర్)’ అనే కీలక అంశాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి మాట్లాడుతూ… పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని అమాయకులతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయిస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బాధితులను గుర్తించి రక్షించడంతో పాటు నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా ప్రతి కేసును పకడ్బందీగా దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సదస్సులో ప్రత్యేకంగా పాల్గొన్న ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ప్రతినిధులు మాట్లాడుతూ… రాష్ట్రంలో కార్మికుల అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతోంది, క్షేత్ర స్థాయిలో బాధితులను ఎలా గుర్తించాలి అనే పలు కీలక అంశాలను వివరించారు. పోలీసు శాఖ సమన్వయంతో వెట్టిచాకిరీ బాధితులను రక్షించి వారికి ఉచిత న్యాయ సాయం అందించడంతో పాటు, ప్రభుత్వ పథకాల ద్వారా పునరావాసం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఐజేఎం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. చట్టవిరుద్ధంగా కార్మికులను తరలించే బ్రోకర్ల వ్యవస్థను ఛేదించడంలో దర్యాప్తు అధికారులకు వారు మెలకువలు నేర్పించారు. ఈ ప్రతిష్టాత్మక అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Special awareness session for police officers…