- నాడు కన్వీనర్ల కోసం….నేడు ఇన్చార్జ్ కోసం…
- సూపర్ -6 ఫైట్లు
-ప్రజా సమస్యలు గాలికి…
పుంగనూరుముచ్చట్లు:
నారావారిపార్టీలో క్రమశిక్షణారాహిత్యంగా ఆపార్టీ నేతలు పదవుల కోసం ఆదిపత్యం చలాయిస్తూ ముష్టి యుద్దాలకు దిగుతున్న సంఘటనలు పుంగనూరులో కొకొల్లలు. నాడు తెలుగుదేశం పట్టణ , మండల కన్వీనర్ల పదవుల కోసం కుర్చీలతో ముష్టి యుద్దాలు చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నేడు ఏకంగా రాష్ట్ర మంత్రుల సమక్షంలో తిరుపతిలో వర్గపోరు తారా స్థాయికి చేరి తలలు పగలగొట్టుకోవడం జరిగింది.
పుంగనూరు నియోజకవర్గంలో ఇన్చార్జ్గా చల్లా రామచంద్రారెడ్డి కొనసాగుతున్నారు. ఆయన దగ్గర ఉన్న క్యాడర్ తమ ఇష్టారాజ్యాంగ ప్రజలను దోచుకుంటున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం, దీనిపై తమ్ముళ్లపై కేసులు నమోదు చేశారు. ఇలా ఉండగా గత ఏడాది నవంబర్ 21న కన్వీనర్ల నియామకం కోసం పార్టీ పరిశీలకులు అమరనాథ్రెడ్డి, మహేష్ యాదవ్ లు వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆదిపత్యపోరుకు బహిరంగ సవాల్లు చేసుకున్నారు. ఇలా ఉండగా వ్యాపారవేత్త మధుసూదన్నాయుడు నియోజకవర్గంలో పర్యటించడం ప్రారంభించారు. ఇన్చార్జ్కి వ్యతిరేకంగా ఉన్న వర్గం నాయకులతో మంతనాలు చేశారు. పట్టణ మాజీ కౌన్సిలర్ దేశాదిప్రకాష్ , కాపు సంఘ నాయకుడు మధురాయల్ , మండల నాయకులు సుబ్రమణ్యంరాజు, పెద్దమోహన్నాయుడు తో పాటు నియోజకవర్గంలోని జనార్ధన్, గంగులప్ప, నాగరాజాచారి, శివ, రాఘవరాయల్, సదుం వెంకట్రమణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వినోద్, దేవేంద్ర, అమర,అనేక మందిని కూడ గట్టారు. నియోజకవర్గంలో ఇన్చార్జ్కి వ్యతిరేకంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి, గ్రూపును పదిలం చేసుకున్నారు. చాపక్రింద నీరులా అసమ్మతి వర్గం తిష్ట వేసింది.
ఇన్చార్జ్ మార్పు ….
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండేళ్లలో వీధిన పడిందని , ఇన్చార్జ్ని మార్చి మధుసూదన్నాయుడుకు ఇవ్వాలంటు ఆయన వర్గం అధిష్ఠానానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. జూన్16న విజయవాడలో లోకేషన్ను కలసి ఫిర్యాదు చేశారు. కానీ అధిష్ఠానం నిమ్మకు నీరేత్తినట్లు ఉండటంతో తమ్ముళ్లు రగిలిపోయారు. తాడోపేడో తెల్చేందుకు సిద్ధమైయ్యారు. ఈ సమయంలో తిరుపతిలో మంత్రులు రాంప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు ఎస్కె.రమణారెడ్డి, సోమల సురేష్ లు కూడ మధుసూదన్నాయుడుకు మద్దతు పలికి, ఇన్చార్జ్ మార్పుపై ముక్త కంఠంతో పలికేందుకు సిద్ధమైయ్యారు. ఈ సమయంలో చల్లా బాబు వర్గం, మధుసూదన్నాయుడు వర్గం ఒకరునొకరు మాటల యుద్ధం సాగింది. ఒకరినొకరు కొట్టుకోవడంతో మధుసూదన్నాయుడు వర్గానికి చెందిన ముల్లంగి రమణకు తీవ్ర రక్తగాయాలైంది. దీనిపై అసమ్మతి నాయకులు అందరు ఏకమై మంత్రులు డౌన్…డౌన్… అంటు నినాదాలు చేశారు. ఇన్చార్జ్ని మార్పు చేసి తీరాలని పట్టుబట్టారు. ఇలా ఉండగా ఇన్చార్జ్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, బడా నేతలు సైతం పావులు కదపుతున్న విషయం చల్లాకు తెలియడంతో ఘర్షణ తీవ్ర స్థాయికి చేరినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం అధిష్ఠానం ఇన్చార్జ్ని మార్చుతారా… లేదా కొట్టుకుచావండని వదిలేస్తారా…అన్నది వేచి చూడాల్సి ఉంది.


Tags; Fistfights among party cadres over positions…