పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినులకు ఉచితంగా సిరి సంపద మాల్ట్ ప్యాకెట్లను అందరి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ పి. అయూబ్ ఖాన్ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో బాలికల్లో పోషకాహార లోపం, రక్తహీనత సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని, వాటి నివారణకు సమతుల్య పోషకాహారం ఎంతో అవసరమన్నారు. అదేవిధంగా 40కుపైగా ధాన్యాలు, చిరుధాన్యాలతో తయారైన సిరి సంపద మాల్ట్’ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదల ఏకాగ్రతకు దోహదపడుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులని అయూబ్ ఖాన్ పేర్కొన్నారు, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు నరసింహులు త్రిమూర్తి రెడ్డితో కలిసి విద్యార్థినులకు మాల్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి, అధ్యాపకులు భవాని దేవి, భారతి, చంగయ్య, బాలరాజు నాయక్, ప్రదీప్ కుమార్, జగన్మోహన్, సుమలత పాల్గొన్నారు.
Tags: Free distribution of ‘Siri Sampada’ malt packets to female students.