July 7, 2026
Explore
అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి.

అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి.

July 7, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.

మృతిని కుటుంబానికి అండగా ఉంటాం:- జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

టి.సుండుపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా (PC 2671) విధులు నిర్వహిస్తున్న గండి వెంకటేశ్వర్లు (46) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఆయన గత 15 ఏళ్లుగా కడప, అన్నమయ్య జిల్లాల్లో క్రమశిక్షణతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మరణంపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. ఒక సమర్థుడైన కానిస్టేబుల్‌ను కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని, బాధిత కుటుంబానికి డిపార్ట్‌మెంట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మృతుని నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. దహన సంస్కారాల తక్షణ ఖర్చుల నిమిత్తం ఎస్పీ తరఫున రూ. 1,00,000/- (లక్ష రూపాయల) నగదును మృతుని సతీమణి ప్రమీలకు అందజేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

రాయచోటి మండలం మాసాపేట రెడ్డివారిపల్లి గ్రామంలో మంగళవారం వెంకటేశ్వర్లు అంత్యక్రియలు జరిగాయి. ఏఆర్ పోలీసు బృందం గాలిలోకి కాల్పులు జరిపి, అధికార లాంఛనాలతో మృతునికి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ (కడసారి గౌరవ వందనం) సమర్పించింది. ఈ అంతిమయాత్రలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

Tags:Constable dies of illness.