మదనపల్లెముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఒకే ఇంటిని ఇద్దరికి విక్రయించి మోసం చేసిన కేసులో మదనపల్లె రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జె. కీర్తన కీలక తీర్పు వెలువరించారు. స్థానిక బర్మావీధికి చెందిన రాయచోటి మునెమ్మ 2016లో తన ఇంటిని పులి వాసుదేవరెడ్డికి విక్రయించింది. అయితే ఆ ఇంటిని కొనుగోలుదారుడికి అప్పగించకుండా, అనంతరం తన తమ్ముడు ఈ. సుబ్బరాయుడికి మరోసారి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో బాధితుడు పులి వాసుదేవరెడ్డి మదనపల్లె టూ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి మునెమ్మ, ఆమె భర్త వెంకట సుబ్బయ్య, కుమారులు మనోహర్, ఈశ్వరయ్య, తమ్ముడు ఈ. సుబ్బరాయుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో నేరం రుజువుకావడంతో కోర్టు మునెమ్మకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. అలాగే ఆమె భర్త వెంకట సుబ్బయ్య, కుమారులు మనోహర్, ఈశ్వరయ్య, తమ్ముడు ఈ. సుబ్బరాయుడికి మూడు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని పోలీసులు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) కృష్ణారెడ్డి వెల్లడించారు.
Tags: Woman sentenced to two years in prison for selling same house twice