తిరుపతి ముచ్చట్లు:
మూడో రోజు తెప్పోత్సవం ఆధ్యాత్మిక వైభవం
ఆదివారం ఐదు చుట్లతో నాలుగో రోజు తెప్పోత్సవం – గజవాహనంపై అమ్మవారి మహోత్సవ విహారం
తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం పద్మసరోవరంలో శ్రీ పద్మావతీ అమ్మవారు దివ్య తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు అభయ, ఆశీర్వాదాలను ప్రసాదించారు. గోవింద నామస్మరణలు, వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ ఉత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.
ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేయగా, 6.30 నుండి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ పద్మావతీ అమ్మవారు ఊరేగి భక్తులను కటాక్షించారు.
నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అమ్మవారు తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులకు దివ్య దర్శనమిస్తారు. అనంతరం సిరుల తల్లి గజవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రమేష్, మునిచెంగల్రాయులు, సురేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



Tags: Goddess Sri Padmavati blessed the devotees while seated on a divine float in the Padma Sarovaram.