వీరబల్లి ముచ్చట్లు:
అనారోగ్యంతో మంచానికే పరిమితమైన మిత్రులకు జీవితాంతం అండగా నిలిచిన సహపాఠులు
కాలం మారినా… పరిస్థితులు మారినా… చిన్ననాటి స్నేహం మాత్రం మారదని మరోసారి నిరూపించారు ఈ మిత్రులు. చిన్నప్పుడు కలిసి ఆడినవారు… కలిసి చదువుకున్నవారు… జీవితంలో ఎవరికైనా కష్టం వస్తే తమదే బాధగా భావించి అండగా నిలిచారు.
వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992లో పదో తరగతి చదివిన సహపాఠులు, ప్రస్తుతం పక్షవాతం (పెరాలసిస్)తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమ మిత్రులు వెంకటసుబ్బయ్య, రెడ్డయ్య పరిస్థితిని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యం చెప్పడమే కాదు… వారి వైద్యానికి తామున్నామని భరోసా కల్పించారు.
తోటి మిత్రుడు ఆర్ఎంపీ డాక్టర్ నిస్సార్ ఆర్థిక సహకారంతో బాధితులకు జీవితాంతం అవసరమైన మందులను అందిస్తామని ప్రకటించారు. తొలి విడతగా మూడు నెలలకు సరిపడా మందులను అందజేశారు. ఈ సందర్భంగా విఆర్డిఎస్ సురేంద్రరెడ్డి, డాక్టర్ నిస్సార్, శేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
“సంతోషంలో తోడు నిలిచేవారు చాలామంది ఉంటారు… కానీ కష్టంలో చేయి పట్టి నడిపించేవారే నిజమైన స్నేహితులు” అనే మాటను ఈ మిత్రబృందం చేతల్లో చూపించింది. వారి సేవాభావం, మానవత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Tags: Kudos, friends… such friendship is rare these days!