హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ వివాదం చివరికి హత్యకు దారి తీసింది. భార్య ఉషారాణిని ఆమె భర్త అరుణ్ తుపాకీతో కాల్చి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం, అరుణ్ మరియు ఉషారాణి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు ఘర్షణలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో తెల్లవారుజామున “మాట్లాడుకుందాం” అంటూ ఉషారాణిని పిలిపించిన అరుణ్, ముందస్తు ప్రణాళికతో మరో వ్యక్తి సహాయంతో ఆమెపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కాల్పుల ఘటనలో ఉషారాణి అక్కడికక్కడే మృతి చెందగా, నిందితుడు అరుణ్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో అరుణ్ గతంలో కూడా తుపాకీతో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితం అంబర్పేట్ ప్రాంతంలో తుపాకీతో హల్చల్ చేసిన కేసులో కూడా అతడి పేరు ఉన్నట్లు సమాచారం. అలాగే పాతబస్తీకి చెందిన కొందరి ద్వారా అక్రమంగా తుపాకీ సంపాదించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Tags;Sensation in Malkajgiri: Husband Arun shoots wife dead.