June 9, 2026
Explore
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే

June 9, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS‑1 CCD విభాగంలో లాడిల్ పేలి ద్రవ ఉక్కు ఎగసిపడడంతో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలకు నేడు KGH మార్చురిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఘటనపై నిపుణుల కమిటీ విచారణ ప్రారంభిస్తోంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏకంగా 8 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో యావత్ ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం, మరణించిన వారి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కర్మగారంలోని SMS‑1(స్టీల్ మెల్టింగ్ షాప్ 1) లోని CCD (కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్‌మెంట్) విభాగంలో లాడిల్ పేలి లిక్విడ్ ఐరన్ కారడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 15 మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్నట్లు సమాచారం. లిక్విడ్ ఐరన్ తాకడంతో 8 మంది మృతి చెందగా, మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఫైర్ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

👉మృతుల వివరాలు

  1. గోల్డ్ కుమార్ (మేనేజర్), పర్మినెంట్ ఉద్యోగి
  2. భాను కుమార్ (టెక్నీషియన్), పర్మినెంట్ ఉద్యోగి
  3. జీవి అప్పారావు, పర్మినెంట్ ఉద్యోగి
  4. కృష్ణ నాగు, పర్మినెంట్ ఉద్యోగి
  5. ప్రభాకర రావు (ఫోర్‌మన్), పర్మినెంట్ ఉద్యోగి
  6. త్రినాధ్, కాంట్రాక్ట్ కార్మికుడు
  7. అప్పలరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు
  8. రమణ, కాంట్రాక్ట్ కార్మికుడు

👉తీవ్రంగా గాయపడిన వారు..

  1. జి సూరిబాబు(55)
  2. కే పైడిరాజు(57)
  3. పి శ్రీనివాసరావు(51)
  4. ఆర్ మల్లికార్జునరావు(41)
  5. జి అర్జున అప్పారావు(58)
  6. బి సత్యానంద్(38)

గాయపడిన వారికి సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరణించిన వారి మృతదేహాలకు నేడు KGH మార్చురిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించారు.

👉విచారణకు కమిటీ..

ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. బోకారో స్టీల్ ప్లాంట్ సహా ఇతర ఉక్కు కర్మాగారాలకు చెందిన ముగ్గురు నిపుణులు కమిటీలో ఉన్నారు. కమిటీ నేడు స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి SMS‑1 CCD ఘటన స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించనుంది. మంగళవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు సమాచారం.

Tags:What was the root cause of the accident at the Vizag Steel Plant? Here are the full details of the deceased.