పల్నాడు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో మాజీ సీఐ చిన్న మల్లయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్లో ఆయన సరెండర్ అయ్యారు. వినుకొండ మండలానికి చెందిన ఓ మహిళ తనపై సీఐ చిన్న మల్లయ్య అత్యాచారం చేసినట్లు ఈ ఏడాది ఏప్రిల్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటు కోళ్ల ఫారం వ్యవహారంలో సీఐతో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు తొలుత చిన్న మల్లయ్యను సస్పెండ్ చేయగా.. అనంతర పరిణామాలతో ఐజీ త్రిపాఠి ఆయన్ని విధుల నుంచి తొలగించారు. మరోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, అప్పటి నుంచి చిన్న మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టుల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో నిందితుడు అజ్ఞాతం వీడాల్సి వచ్చింది. అరెస్టు తప్పదని తెలుసుకున్న చిన్న మల్లయ్య నేడు వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Tags:Rape case: Former CI China Mallayya surrenders before the police.