June 4, 2026
Explore
అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం

June 4, 2026 | Andhra Pradesh

23 ఏండ్ల యువతిపై గ్యాంగ్‌రేప్.. నగ్న వీడియోలు తీసి బెదిరింపులు.. 8 మంది అరెస్ట్

తిరువణ్ణామలై ముచ్చట్లు:

తిరువణ్ణామలై, తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో సంచరించే అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై దుండగులు దాడి చేయగా, వారిలో ఒక 23 ఏండ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పవిత్ర క్షేత్రంగా భావించే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం భక్తుల్లో భయాందోళనలకు గురి చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 30న రాత్రి గిరిప్రదక్షిణకు వచ్చిన ఇద్దరు యువతులు అడిఅణ్ణామలై ప్రాంతం సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా కొందరు దుండగులు వారిని అడ్డగించారు. అనంతరం బలవంతంగా సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. మరో యువతిపై కూడా దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

దుండగులు బాధితుల నగ్న వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు దోచుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.

తీవ్ర మానసిక ఆందోళనకు గురైన బాధితులు మే 31న తిరువణ్ణామలైలోని మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో పాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు.

ఈ కేసును ఛేదించేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు, వివిధ ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా మొత్తం 11 మంది నిందితులను గుర్తించినట్లు సమాచారం. వారిలో వాసుదేవన్, ఆకాష్, అప్పు, హరిహరన్, అరుణ్ కుమార్, శివగణేషన్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

అయితే, ఈ ఘటనలో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. బాధితులలో ఒకరు రాత్రి సమయంలో తన స్నేహితుడితో కలిసి గిరిప్రదక్షిణ మార్గంలో తిరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం బాధితురాలి స్నేహితుడిని విచారించిన పోలీసులు, అతడి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలో భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి వేళల్లో భక్తుల రక్షణ కోసం అదనపు పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, గస్తీ బలగాల పెంపు అవసరమని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పవిత్ర క్షేత్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుండగా, కేసులో మిగిలిన నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Tags: Horrific Incident on the Arunachalam Giripradakshina Route