ధర్మవరంలో మహిళలతో జిల్లా ఎస్పీ ముఖాముఖి….
ధర్మవరం ముచ్చట్లు:
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, మంగళవారం ధర్మవరం పట్టణంలోని పలు కాలనీలను సందర్శించి మహిళలు, స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ తిక్కస్వామి కాలనీ, శివనగర్, నేసేపేట, మాధవ్ నగర్, దర్గా సర్కిల్, లోనీ పేట, చెరువు కట్ట, ఎల్సీకే పురం, ఎంజీ కాలనీలను సందర్శించి మహిళల భద్రత, సంఘ విద్రోహ కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, యువతపై ప్రభావం చూపుతున్న పరిస్థితులు, ప్రజా భద్రత అంశాలపై ఆరా తీశారు.
మహిళలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ:
“అమ్మా… మీరు క్షేమంగా ఉన్నారా? మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలున్నాయా? ఎవరైనా వేధిస్తున్నారా? రాత్రి వేళల్లో మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారు ఉన్నారా? ఎలాంటి భయం పడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని భరోసా కల్పించారు.
గృహహింస, ఈవ్ టీజింగ్, బెదిరింపులు, వేధింపులు, రాత్రి సమయంలో కలిగే సమస్యలను ఆలస్యం చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ కారణంగా భద్రతాభావం పెరిగిందని, ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే పోలీసులు స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నారని ఎస్పీకి తెలిపారు.
మహిళల రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే రౌడీ మూకలు, సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల సహకారంతో జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మహిళలు, బాలికలకు భరోసా కల్పించే ఇటువంటి ఫీల్డ్ విజిట్స్ను నిరంతరం కొనసాగిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్, టూటౌన్ సీఐ రెడ్డప్ప, ఎస్ఐలు వీరేష్, ఉమాదేవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: “Mother… are you safe? Are there any problems?”