March 15, 2026
Explore
పుంగనూరులో విషాదం

పుంగనూరులో విషాదం

March 15, 2026 | Andhra Pradesh


-ఒకే కుటుంబంలో నలుగురు మృతి
-మోటారుసైకిల్‌ కార్భన్‌ మోనాక్సెడ్‌ వాయువు పీల్చడంతోనే మృతి

  • విషాదంలో కుటుంబం
  • ఎమ్మెల్యే, ఎంపి సంతాపం
  • ప్రాణాలతో బయటపడ్డ బిందు

పుంగనూరుముచ్చట్లు:

ద్విచక్రవాహనం మరమ్మతులు చేసుకొచ్చి, ఇంట్లో స్టార్టింగ్‌లో పెట్టి నిద్రిస్తున్న నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద కర సంఘటన ఆదివారం పట్టణంలోని త్యాగరాజవీధిలో జరిగింది. పట్టణంలోని త్యాగరాజువీధిలో నాయిబ్రాహ్మణ కులానికి చెందిన మురళి, ఆయన భార్య రేవతి దంపతులతో పాటు మురళి తండ్రి రామచంద్ర (75) వీరితో ఉన్నాడు. అలాగే మురళి పిల్లలు కార్తీక్‌(15), బిందు (14)తో పాటు కవలపిల్లలు చందన(7) ,చరిత(7) కలసి ఉన్నారు. కార్తీక్‌ స్థానిక జెడ్పి హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. చరిత, చందనలు ప్రైవేటుస్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నారు. ఇలా ఉండగా మురళికి చెందిన ద్విచక్రవాహనం బోరు చెడిపోవడంతో మెకానిక్‌ వద్దకు వెళ్లి శనివారం రిపేరు చేయించాడు. మెకానిక్‌ సూచనల మేరకు ద్విచక్రవాహనాన్ని తీసుకొచ్చి రాత్రి స్టార్టింగ్‌ ఇంటిలోని హాల్‌లో పెట్టాడు. మురళి దంపతులు మిద్దెపైన గల రూములో పడుకున్నారు. తాత రామచంద్ర, మనవడు కార్తీక్‌ , కవలపిల్లలు చరిత, చందనలు తాతతో కలసి నిద్రకు ఉపక్రమించారు. కాగా మరో మనవరాలు బిందు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఆపాప ఇంటిలో లేదు. ఇలా ఉండగా ఇంట్లో కిటికీలు కూడ లేకపోవడంతో బండి కార్భన్‌ మోనాక్సెడ్‌ ఇంట్లో చుట్టుకుంది. తాత, మనవడు, మనవరాళ్లు ఆ విషవాయులను పీల్చడంతో రాత్రి నిద్రలోనే నిశ్చేష్టులై ప్రాణాలు కోల్పోయారు. ఉదయం మురళి, ముళిరళి భార్య కలసి పరిశీలించగా చనిపోయిన విషయాన్ని గమనించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి , కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుల భౌతికకాయాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై మృతులకు నివాళులర్పించారు.

ప్రాణాలతో బయటపడ్డ బిందు…

పట్టణంలో విషవాయువులు పీల్చి మృతి చెందిన కుటుంబంలో ఉన్న బిందు ప్రాణాలతో బయటపడింది. శనివారం తమ బంధువుల ఇంటికి బిందు వెళ్లింది. లేకపోయింటే విషవాయువులకు బిందు కూడ బలైయే అవకాశాలు ఉండేది.

ఎమ్మెల్యే, ఎంపి పరామర్శ….

పట్టణంలో నాయిబ్రాహ్మణ కులానికి చెందిన నలుగురు ఒకే కుటుంబంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి మిదున్‌రెడ్డి లు సంతాపం తె లిపారు. తక్షణమే మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాను సంఘటన స్థలానికి పంపి, బాధిత కుటుంభానికి అండగా నిలివాలని సూచించారు. బాధిత కుటుంభాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చి ఓదార్ఛారు.

Tags: Tragedy in Punganur