బాపట్ల ముచ్చట్లు:
మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామం
బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… స్థానిక బిసి కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత(46) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య(25) ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె దివ్య హైదరాబాదులో గత మూడు సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగితో పెద్దలు వివాహం నిశ్చయించి గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన ఎంగేజ్మెంట్ చేశారు… ఈ వేసవిలో వివాహం జరగవలసి ఉండగా ఈనెల నాలుగవ తేదీ వరుడు దివ్యను, ఆమె తల్లిదండ్రులను మాట్లాడాలంటూ మార్టూరులోని తమ నివాసానికి పిలిపించాడు. ఈ సందర్భంగా శేషుబాబు తాను హైదరాబాదులో దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు బాధిత కుటుంబానికి చూపించి పెళ్లికి నిరాకరిస్తున్నట్లు తేల్చి చెప్పాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లీకుమార్తెలు మార్టూరులోనే ఎలుకల మందుతో పాటు గడ్డి మందు కొనుగోలు చేసి ద్రోణాదుల వచ్చి ఇద్దరూ తాగి పడుకున్నారు. మరుసటి రోజు 5వ తేదీ సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న దివ్య, సుజాతలను గమనించిన భర్త శ్రీనివాసరావు మొదట చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులలో విడివిడిగా చికిత్స నిమిత్తం చేర్పించారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత, దివ్యల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గురువారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో దివ్య మృతి చెందగా, 10 గంటల ప్రాంతంలో తల్లి సుజాత ఆసుపత్రిలోనే మరణించింది. సుజాత భర్త శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మార్టూరు పోలీసులకు సమాచారం అందించారు. మార్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: A tragic incident: Overcome with severe distress after the groom refused to proceed with the wedding following their engagement, a mother and daughter committed suicide.