పాకాలపాడులో భారీ కార్డన్ అండ్ సెర్చ్ 700 ఇళ్లలో సోదాలు
సరైన పత్రాలు లేని 44 బైకులు, ఒక కారు, 200 లీటర్ల డీజిల్ స్వాధీనం.
మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం: డీఎస్సీ పి.శ్రీనివాసరావు.
నర్సీపట్నం ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆదేశాల మేరకు చేపట్టిన “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో భారీ తనిఖీలు నిర్వహించారు. శనివారం గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాకాలపాడు గ్రామంలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు నర్సీపట్నం డీఎస్పీ (SDPO) పి.శ్రీనివాసరావు తెలిపారు.
ఈగల్ సెల్ ఐజీపీ అకే రవికృష్ణ ఐపీఎస్., విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాధ్ జట్టి మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్లో ఈగల్ టీమ్ (EAGLE), స్పెషల్ పార్టీ మరియు వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన 70 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు పాకాలపాడు గ్రామంలోని సుమారు 700 ఇళ్లను మరియు 1000 మంది వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి సాగు, రవాణా మరియు పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల నివాసాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
మొత్తం 270 వాహనాలను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని 44 మోటార్ సైకిళ్లు, ఒక కారును మరియు 200 లీటర్ల డీజిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో గంజాయి కేసులలో ఉన్న ముద్దాయిలకు మరియు సస్పెక్ట్ షీట్ ఉన్న వ్యక్తులకు పోలీసులు స్పాట్లోనే కౌన్సెలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, సన్మార్గంలో నడవాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతుందని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” చేయించారు.
మీ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 లేదా 100/112 కు డయల్ చేయండి.
సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ మరియు టౌన్ సిఐలు రేవతమ్మ మరియు గఫూర్, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం ఎస్ఐలు రామారావు, దామోదర్ నాయుడు మరియు తారకేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:’Operation Vajra Prahar’ in Narsipatnam Sub-division