తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అక్కడి వాతావరణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజకవర్గాల పంపకాల్లో ఆయా పార్టీల అగ్రనేతలు తీరిక లేకుండా గడుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి
ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి
ఈ పరిణామాల మధ్య ప్రముఖ దర్శకుడు సుందర్ సీ రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి బరిలో నిలిచారు. పుదియ నీథి కచ్చి (పీఎన్కే) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. పీఎన్కే.. అన్నా డీఎంకే మిత్రపక్షం. 2001లో ఆరణి చొక్కలింగం షణ్ముగం ఈ పార్టీని నెలకొల్పారు. ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో జట్టు కట్టింది
సీట్ల పంపకాల్లో భాగంగా మధురై సెంట్రల్ నియోజకవర్గాన్ని దక్కించుకుంది. ఇక్కడి నుండి సుందర్ సీ పోటీ చేస్తారని షణ్ముగం ప్రకటించారు. ఇది ఆయనకు తొలి అసెంబ్లీ ఎన్నిక. పొత్తులో భాగంగా పీఎన్కే కు రెండు స్థానాలు దక్కాయి. ఇందులో మధురై సెంట్రల్ ఒక్కటి. రెండవ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
నటి ఖుష్బూ తర్వాత ఆమె భర్త సుందర్ సఈ కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దర్శకుడు, నటుడు, గాయకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాతగా సుందర్ సీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన తీసిన హార్రర్ కామెడీ సినిమాల సిరీస్ ఆరణ్మనై.. తెలుగులో చంద్రకళ, కళావతి, అంతఃపురం, బాక్ పేర్లతో డబ్ అయ్యాయి.
Tags: Star Director Enters the Electoral Fray: In the Constituency Vijay Turned Down…