అమరావతిముచ్చట్లు:
🔹ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి.
👉జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
భూమి కోసం, భుక్తి కోసం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించడమే ఆమెకు నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ వద్ద బిసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు, రజక సంఘం నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1940వ దశకంలో తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటంలో ఐలమ్మ ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయన్నారు. అప్పుడు పోరాటం చేసిన వారిలో ఐలమ్మ లాంటి చాలా కొద్ది మంది మహిళలు ఉన్నప్పటికీ ఆర్మీ లాంటి గేరిల్ల దళాలను ఏర్పాటు చేసి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. ఐలమ్మ జీవిత చరిత్ర భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ సమాజానికి ఐలమ్మ చేసిన సేవలకు గుర్తుగా కోఠి ఉమెన్స్ కాలేజీకి ఆమె పేరును పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.అనంతరం పలువురు వక్తలు కూడా మాట్లాడుతూ ఐలమ్మ ఘనతలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, బీసీ అభివృద్ధి శాఖ అధికారి అక్బర్ పాషా, బీసీ, రజక సంఘాల నేతలు, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Tags: Ailamma’s struggle against the feudal system.