- ఎమ్మెల్యే గళ్ళా మాధవి
- జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
అమరావతిముచ్చట్లు:
అమరావతి వెలగపూడిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల జీరో అవర్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, ప్రజా సమస్యలను, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యతను నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.
క్షేత్ర స్థాయిలో పని చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విలేఖరులలో అధిక శాతం మంది అత్యల్ప వేతనాలతో పని చేస్తున్నారని, సొంత ఇల్లు నిర్మించుకోవడం వారికి పెద్ద సవాల్గా మారిందని తెలిపారు. జర్నలిస్టుల వృత్తిలో స్థిరత్వం, నిర్దిష్టమైన పని వేళలు లేకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందించే ఆరోగ్య కార్డులు, గృహ నిర్మాణ పథకాలు వంటి ప్రోత్సాహకాలు జర్నలిస్టుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పిస్తాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో జర్నలిస్టు కాలనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రతి వర్గాన్ని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి వారి అభ్యున్నతి కోసం కృషి చేసే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు గృహ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో జి.ఓ. నెం. 67, 107లను తీసుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ జీవోలను అమలు చేస్తూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదంటే గృహ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సభ ద్వారా కోరారు.
Tags: Housing facilities should be provided to journalists.