July 23, 2026
Explore
రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వార్తలు నిరాధారమైనవి

రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వార్తలు నిరాధారమైనవి

July 23, 2026 | Andhra Pradesh


– సబ్ రిజిస్ట్రార్- గురుస్వామి స్పష్టం

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు సంబంధించిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని సబ్ రిజిస్ట్రార్ ఎం. గురుస్వామి స్పష్టం చేశారు. జి.ఓ.ఎం.ఎస్. నెం.396 ద్వారా రిజిస్ట్రేషన్ శాఖను లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరించడం లేదని బుధవారం పాత్రికేయులతో మాట్లాడుతూ తెలిపారు.

ప్రజలకు ఒకేచోట పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానంతో వేగవంతమైన సేవలు అందించేందుకే ప్రభుత్వం ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని చట్టబద్ధ అధికారాలు, పత్రాల పరిశీలన, నమోదు, రికార్డుల నిర్వహణ వంటి విధులు యథావిధిగా సబ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ శాఖ ఆధీనంలోనే కొనసాగుతాయని వెల్లడించారు.

ప్రభుత్వ డేటా లేదా ప్రజల ఆస్తుల వివరాలు ఏ ప్రైవేట్ సంస్థకూ బదిలీ కావని, డేటా భద్రతపై వస్తున్న ఆందోళనలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అవసరమైన వివరాల కోసం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించి రిజిస్ట్రేషన్ సేవలను యథావిధిగా పొందవచ్చని సూచించారు.

Tags; Reports regarding the privatization of the Registration Department are baseless.