అమరావతిముచ్చట్లు:
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రయోజనం లేకుండా పదేపదే ఫిర్యాదులు చేసే వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేసేందుకే పిటిషన్లు వేస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81 మంది లిటిగెంట్ (సమస్యాత్మక) పిటిషనర్లను గుర్తించామని, వీరు ఒక్కొక్కరు సగటున 246 పిటిషన్లు వేస్తున్నారని తెలిపారు. వీరి వివరాలను కలెక్టర్లకు పంపి, వారు పెట్టే అర్జీల్లో ప్రజా ప్రయోజనం ఉంటేనే పరిశీలించాలని స్పష్టం చేశారు.
ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్థికేతర అంశాలకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ, సమస్యలు రాకముందే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని పరిపాలన విధానాల్లో మార్పులు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags: We have identified 81 litigant petitioners in the state: CM Chandrababu