July 17, 2026
Explore
వైభవంగా ప్రారంభమైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

వైభవంగా ప్రారంభమైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

July 17, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

జూలై 20న పార్వేట ఉత్సవం

శ్రీనివాసమంగాపురంలో ఆధ్యాత్మిక వైభవం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ప్రతిరోజూ విశేష పూజలు, స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవలు, వాహనసేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఉత్సవాలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, బలి, శాత్తుమొర, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు ఆణివార ఆస్థానం, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

భక్తుల మధ్య పెద్ద శేష వాహనంపై స్వామివారి దివ్య విహారం

శుక్రవారం రాత్రి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు పెద్ద శేష వాహనంపై ఆలయ మాడవీధుల్లో భక్తుల మధ్య దివ్యంగా విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలను మారుమోగించారు.

జూలై 18న రాత్రి హనుమంత వాహనం, జూలై 19న రాత్రి గరుడ వాహనంపై స్వామివారు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.

జూలై 20న పార్వేట ఉత్సవం

సాక్షాత్కార వైభవోత్సవాల ముగింపు సందర్భంగా జూలై 20న శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 గంటలకు పార్వేట ఉత్సవం, అనంతరం ప్రత్యేక ఆస్థానం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమాలు

మహోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాలల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నారు.

సాక్షాత్కార వైభవోత్సవాల చారిత్రక విశిష్టత

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 14వ శతాబ్దం నుంచే విశిష్టమైన చారిత్రక ప్రాశస్త్యం ఉంది. విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయంలో వేదపారాయణం, నిత్యారాధనలు, ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. అనంతరం శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యులు ఆలయాన్ని పునరుద్ధరించి పూజా కైంకర్యాలను పునఃప్రారంభించారు.

ప్రకృతి వైపరీత్యాలు, యవనుల దండయాత్రల వల్ల దెబ్బతిన్న ఆలయ గోపురాలను పునర్నిర్మించి, నిత్యపూజలు, నైవేద్యాలు, ఉత్సవాల నిర్వహణకు శ్రీ చిన తిరుమలయ్య విశేష కృషి చేసినట్లు 1540 మార్చి 22 నాటి శాసనం తెలియజేస్తోంది.

1967లో టీటీడీ ఆలయ నిర్వహణను స్వీకరించి, శ్రీవైఖానస ఆగమోక్తంగా ఆలయ పునరుద్ధరణ చేపట్టి, నిత్యదిట్టం ఏర్పాటు చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించింది. 1981 సంవత్సరం నుండి శ్రీ స్వామివారి నిత్య కల్యాణోత్సవం, సాక్షాత్కార వైభవోత్సవాలు, బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది.

1940లో స్వామివారి దివ్య ఆదేశంతో ఆలయ పునరుద్ధరణ పూర్తై, ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున తొలి పూజలు నిర్వహించబడ్డాయి. ఆ దివ్య ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది “సాక్షాత్కార వైభవం” పేరిట ఈ మహోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.

బ్రహ్మోత్సవాలకు సమానమైన ప్రాధాన్యం కలిగిన ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి చేరువ చేస్తూ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి కృపాకటాక్షాలను అందిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ హరికృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, అర్చకులు, ఇతర అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: Sri Kalyana Venkateswara Swamy’s ‘Sakshatkara Vaibhavotsavams’ (Manifestation Celebrations) commenced on a grand scale.