మదనపల్లి ముచ్చట్లు:
నేటి సమాజంలో సాంకేతికత పెరిగేకొద్దీ నేరాల స్వరూపం కూడా మారుతున్న నేపథ్యంలో, ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఆదేశాల మేరకు, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు వెళ్లిన పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో మమేకమై వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. తెలియని లింకులు క్లిక్ చేయడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కు స్పందించి వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని పంచుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోతారని పోలీసులు వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్తు పదార్థాలకు బానిసలయ్యే ప్రమాదాలు, వాటివల్ల కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి గురించి వివరించి, యువత క్రీడలు, చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళల భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. చిన్న పిల్లలకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు, చైన్ స్నాచింగ్, అటెన్షన్ డైవర్షన్ వంటి నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.
రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించిన పోలీసులు, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం బాధ్యతాయుత పౌరుడిగా ప్రతి ఒక్కరి కర్తవ్యమని గుర్తు చేశారు. గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వీటి వల్ల నేరాల నియంత్రణ సులభమవుతుందని చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు లేదా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 112, 100 నంబర్లకు లేదా సైబర్ మోసాల విషయంలో 1930 నంబర్కు గంజాయి ఇతర మాదకద్రవ్యాల సమాచారం కోసం ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేర రహిత అన్నమయ్య జిల్లాను నిర్మించగలమని పోలీసులు భరోసా ఇచ్చారు.
Tags: Extensive police awareness programs across the district.