రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట మండలం మన్నూరులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మసీద్ కాంప్లెక్స్లో ఉన్న రెండు దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో పెయింట్ షాప్తో పాటు ఎలక్ట్రికల్ షాప్ అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.
వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. “ఆల్ అమీన్ ట్రేడర్స్”లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
మంటల్లో భారీ మొత్తంలో సామగ్రి కాలిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వెలువడ్డాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
భారీగా ఎగిసిపడిన మంటలతో ప్రాంతమంతా పొగమంచుతో కమ్ముకుపోయి కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags: Massive Fire Accident in Mannur, Rajampet