May 18, 2026
Explore
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు

May 18, 2026 | Andhra Pradesh

– అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి ..

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించరాదని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణమే న్యాయం చేసి ఆ నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని అదనపు ఎస్పీ ఆదేశించారు.

వృద్ధులు, వికలాంగులు మరియు మహిళల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. వాటిని సైతం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అర్జీలుగానే పరిగణించి సకాలంలో పూర్తి న్యాయం చేస్తామని తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయానికి ఇద్దరు దివ్యాంగులు రాగా అదనపు ఎస్పీ వారి వద్దకే వెళ్లి పిర్యాదులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. వారి ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించాలని పీలేరు సిఐ గారిని, ములకలచెరువు సిఐ ని ఆదేశించారు.

Tags:Do not be negligent in resolving complaints.