పుట్టపర్తి ముచ్చట్లు:
జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడానికి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టింది. అందులో భాగంగా
జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలు, ఉత్సవాలు మరియు సున్నిత ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ నిర్వహిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచుతున్నారు. బుధవారం రాత్రి ఎయిర్పోర్ట్ సి ఐ బొజ్జప్ప , తన సిబ్బందితో పుట్టపర్తి అర్బన్ సమీపంలోని కర్ణాటక నాగేపల్లి, సత్తెమ్మ సర్కిల్, కలెక్టరేట్ ,పుట్టపర్తి టౌన్ , రూరల్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా నిర్వహించారు.
ఈ చర్యల ద్వారా నేరాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడం, ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపరచడం మరియు ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
డ్రోన్ పర్యవేక్షణ ద్వారా ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులను గుర్తించి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అలాగే, ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే డయల్ 100/112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సి ఐ బొజ్జప్ప విజ్ఞప్తి చేశారు.జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, ప్రజల సహకారం ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
Tags: Special surveillance with night-vision drone cameras…