చెన్నై ముచ్చట్లు:
ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నటుడు విశాల్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటకలో జరిగిన పరిణామాలను విశాల్ గుర్తు చేశారు. అప్పట్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి, తర్వాత అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పుడు తమిళనాడులో కూడా టీవీకే అధినేత విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని విశాల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో 233 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉందని, ఇలాంటి సమయంలో గవర్నర్ పాలన కాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కావాలని విశాల్ ట్వీట్లో పేర్కొన్నారు.
టీవీకే పార్టీకి దాదాపు మెజారిటీ వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడంలో గవర్నర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని విశాల్ ప్రశ్నించారు. ప్రజల తీర్పుకు గౌరవం ఎక్కడ? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగ హక్కులు రాజకీయ నాయకులకు మాత్రమే కాదని, ప్రజలకు కూడా తెలుసని విశాల్ అన్నారు. విజయ్ తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, తాను కూడా అదే కోరుకుంటున్నానంటూ విశాల్ తన మద్దతు ప్రకటించారు..
Tags: Suspense over Vijay’s ‘Sarkar’—Actor Vishal posts an intriguing tweet.