అనకాపల్లి ముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఆర్ఎస్ఐ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిరికి లక్ష్మీ నరసింహారావు ప్రతిష్టాత్మక “ప్రెసిడెంట్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ – 2024 (ఉత్తమ సేవా పతకం)” అందుకున్నారు. అమరావతి (నేలపాడు)లో వైభవంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
విధుల్లో ఆయన ప్రదర్శించిన అత్యున్నత క్రమశిక్షణ, నిబద్ధత మరియు విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
43 ఏళ్ల సుదీర్ఘ సేవ – ‘క్లూస్ టీమ్’లో 25 ఏళ్ల నైపుణ్యం:
లక్ష్మీ నరసింహారావు కి పోలీస్ శాఖలో 43 ఏళ్ల సుదీర్ఘ సేవా అనుభవం ఉంది. అందులో గత 25 ఏళ్లుగా విశాఖపట్నం సిటీ, అనకాపల్లి, మరియు ఏఎస్ఆర్ జిల్లాల్లో ‘క్లూస్ టీమ్’ (CLUES Team) విభాగంలో సమర్థవంతంగా విధులు నిర్వహించారు.
హత్యలు, దొంగతనాలు, రాబరీ, డకోయిటీ, అనుమానాస్పద మరణాలు తదితర సంఘటనల్లో ఘటనా స్థలాల నుంచి భౌతిక ఆధారాలను అత్యంత నైపుణ్యంతో సేకరించారు.
సేకరించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ (FSL) ద్వారా దర్యాప్తు అధికారులకు (IO) అందించి, క్లిష్టమైన కేసుల్లో నిందితులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా కీలక పాత్ర పోషించారు.
గతంలో సాధించిన పురస్కారాలు:
70 క్యాష్ రివార్డులు (Cash Rewards),
20 జీఎస్సీలు (GSCs),
సేవా పతకం,
వీటన్నింటికీ మకుటంగా ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం దక్కడం విశేషం.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ప్రత్యేక అభినందనలు:
రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆర్ఎస్ఐ లక్ష్మీ నరసింహారావును అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, బుధవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ — “నేర దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ అత్యంత కీలకమైనది. లక్ష్మీ నరసింహారావు గారు క్లూస్ టీమ్లో 25 ఏళ్లుగా నిబద్ధతతో అందించిన సేవలు ప్రశంసనీయం. ఆయన కృషికి దక్కిన సరైన గుర్తింపు ఇది. ఇది అనకాపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగానికి దక్కిన గొప్ప గౌరవం” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, క్లూస్ టీమ్ ఇన్ స్పెక్టర్ టి.విజయ, తోటి సిబ్బంది పాల్గొని ఆర్ఎస్ఐ లక్ష్మీ నరసింహారావు కి శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags: Siriki Lakshmi Narasimha Rao, ‘Clues Team’ In-charge, received the ‘President’s Award’ from Chief Minister Chandrababu.